Spain: ఇటలీ, స్పెయిన్ దేశాల్లో వేల మరణాలు.... ఓ ఫుట్ బాల్ మ్యాచే కారణమా?

Is a soccer match leads thousands of deaths in Spain and Italy
  • ఫిబ్రవరి 19న ఇటలీలో ఫుట్ బాల్ మ్యాచ్
  • స్పెయిన్ నుంచి వేల సంఖ్యలో హాజరైన అభిమానులు
  • అక్కడ్నించే మొదలైన కరోనా విలయం
కొన్నివారాల కిందట ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఇప్పుడా నిశ్చింత మచ్చుకైనా కనిపించడంలేదు. కరోనా కబంధ హస్తాల్లో చిక్కి ఆ రెండు దేశాలు విలవిల్లాడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఇటలీ, స్పెయిన్ దేశాల్లో నిత్యం వందల సంఖ్యలో కరోనా కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు ఆ రెండు దేశాల్లో వేల మరణాలు సంభవించాయి. ఇంతటి విపత్తుకు ఓ ఫుట్ బాల్ మ్యాచే కారణమని విశ్లేషకులు గుర్తించారు. ఫిబ్రవరి నాటికి చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అప్పటికే చాపకింద నీరులా చైనా నుంచి ఆ వైరస్ యూరప్ దేశాలకు పాకింది.

ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కు స్పెయిన్ నుంచి వేలమంది అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన రెండ్రోజులకు ఓ ఇటలీ దేశస్తుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత కరోనా బాధితుల సంఖ్య వందలు, వేలకు చేరింది. స్పెయిన్ లోనూ ఇదే పరిస్థితి! ముఖ్యంగా, ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళ్లొచ్చినవారిలో అత్యధికులు వైరస్ లక్షణాలతో బాధపడ్డారు.

విచారించదగ్గ విషయం ఏమిటంటే, పరిస్థితి తీవ్రతను స్పెయిన్ ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలకు దిగినా, ప్రజల్లో చైతన్యం రాలేదు. లాక్ డౌన్ విధించినా లెక్కచేయలేదు. ప్రజల నిర్లక్ష్యానికి మూల్యం ఇప్పుడు వేల ప్రాణాల రూపంలో కళ్లెదుట కనిపిస్తోంది. ప్రజలు మేల్కొనే సరికి పరిస్థితి వారి చేయి దాటిపోయింది. అటు ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటం కొనసాగిస్తోంది.

అటు ఇటలీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఫుట్ బాల్ మ్యాచ్ జరిగిన లొంబార్డీ ప్రాంతంలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ ముప్పును గుర్తించిన తర్వాత... ప్రేక్షకులు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఎంత ప్రమాదకరమో, ఇద్దరుముగ్గురు క్రీడాకారులు ఈ వైరస్ బారిన పడిన తర్వాత అర్థమైంది. దాంతో ఆ ప్రతిపాదన విరమించుకుని ఏకంగా లీగ్ పోటీలే రద్దు చేశారు.
Spain
Italy
Foot Ball Match
Corona Virus
COVID-19

More Telugu News