Corona Virus: పంజాబ్‌ కు తిరిగొచ్చిన 90 వేల మంది ఎన్‌ఆర్ఐలు.. కరోనా వ్యాప్తిపై ఆందోళన

  • వైరస్ వ్యాప్తిపై  రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన
  • రూ. 150 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ విధింపు
90000 NRIs Back Says Punjab and Predicts Alarming Rise In COVID19 Cases

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా భయంతో వివిధ దేశాల్లో నివాసం ఉంటున్న పంజాబ్‌కు చెందిన దాదాపు 90 వేల మంది ఎన్‌ఆర్ఐలు రాష్ట్రానికి తిరిగొచ్చారు.ఈ విషయాన్ని పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

విదేశాల నుంచి వచ్చిన వారితో రాష్ట్రంలో  వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందువల్ల వైరస్ నివారణ చర్యలకు నిధులు కావాలని కేంద్రాన్ని కోరింది. భద్రత, శానిటైజేషన్, వైద్యం కోసం రూ. 150 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు పంజాబ్‌ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్‌ లేఖ రాశారు.

‘దేశంలో అత్యధిక ఎన్‌ఆర్ఐలు పంజాబ్‌కు చెందిన వాళ్లే. వారిలో 90 వేల మంది ఈ నెలలోనే మా రాష్ట్రానికి తిరిగొచ్చారు. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నాయి. వారి వల్ల వైరస్‌ ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. మా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది’ అని లేఖలో పేర్కొన్నారు.

 

23 మందికి కరోనా

పంజాబ్‌లో ఇప్పటిదాకా 23 మందికి కరోనా సోకగా.. ఒకరు చనిపోయారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ప్రజలు బయటికి రాకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయటికి వస్తే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదేశించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటిదాకా 48 కేసులు నమోదయ్యాయి.

More Telugu News