Poland: క్వారంటైన్‌లో ఉన్నట్టు పోలెండ్ ప్రజలు ఇలా నిరూపించుకోవాలట!

  • చిన్న దేశమైన పోలెండ్‌లో కఠిన ఆంక్షలు
  • ప్రజల కోసం హోం క్వారంటైన్ యాప్
  • నిర్బంధంలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు సెల్ఫీలు అప్‌లోడ్ చేయాల్సిందే
Poland Launches App For Quarantined People To Send Selfies From Home As Proof

కరోనా మహ్మమ్మారిని అణచివేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక, కరోనాతో అల్లకల్లోలం అవుతున్న ఐరోపా దేశాల్లో ఈ ఆంక్షలు మరింత కఠినంగా ఉన్నాయి. ఇక పోలెండ్ ప్రభుత్వమైతే మరో అడుగు ముందుకేసింది. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించిన ప్రభుత్వం..  తాము నిజంగానే నిర్బంధంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యతను కూడా వారి నెత్తినే పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘హోం క్వారంటైన్’ యాప్‌ను తయారు చేసింది.

ప్రజలందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. తాము ఇంట్లోనే ఉన్నట్టు ఎప్పటికప్పుడు సెల్ఫీలు తీసుకుని అందులో అప్‌లోడ్ చేయాలని సూచించింది. అది చూసిన అధికారులు వారు ఇంట్లోనే ఉన్నట్టు ధ్రువీకరిస్తారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని వారి ఇళ్లకు పోలీసులు పదేపదే వస్తూ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకుంటారు. ఈ యాప్‌లో ఉన్న జియో లొకేషన్, పేస్ రికగ్నిషన్ సాంకేతిక పటిష్టంగా పనిచేస్తుంది.

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులందరూ కలిసి సెల్ఫీలు దిగి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసే సెల్ఫీలను ఫేస్ రికగ్నిషన్ సాంకేతిక గుర్తిస్తుంది. సెల్ఫీ అప్‌లోడ్ చేయాలన్న నోటిఫికేషన్ రాగానే వెంటనే ఆ పని చేయాలి. లేదంటే 20 నిమిషాల్లోపే పోలీసులు వచ్చేస్తారు. కాగా,  పోలెండ్‌లో ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చిన్నదేశమైన పోలెండ్ జనాభా కేవలం 3.8 కోట్లు.

More Telugu News