L.Murugan: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది!

  • తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై రావడంతో పదవి ఖాళీ
  • డాక్టర్ మురుగన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ 
  • మోదీ, అమిత్ షా, నడ్డాలకు మురుగన్ కృతజ్ఞతలు
L Murugan Appointed as Tamil Nadu BJP Chief

తమిళనాడు బీజేపీ అధక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తర్వాత అక్కడ ఆ పోస్టు ఖాళీ అయింది. ఇప్పుడా స్థానంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్, మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎల్‌.మురుగన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

మురుగన్ గత 15 సంవత్సరాలుగా మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక కీల్పాక్కంకు చెందిన మురుగన్  డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయం నుంచి బీఎల్‌, మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎంఎల్‌ డిగ్రీ అందుకున్నారు.  బీజేపీ చీఫ్‌గా ఎన్నికైన అనంతరం డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

More Telugu News