Rana Daggubati: మహిళా జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రానా

  • మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న అనిర్బన్ బ్లా
  • అనిర్బన్ తో రానా డిన్నర్ చేసినట్టు కథనం రాసిన పత్రిక
  • వాస్తవాలు తెలుసుకోవాలని పత్రికకు రానా హితవు
  • మరో కథనం రాసిన సదరు మీడియా సంస్థ
  • ఈసారి మరికాస్త ఘాటుగా స్పందించిన రానా
Rana get anger over media journalist

  నమ్రతా జకారియా అనే మహిళా జర్నలిస్టుపై టాలీవుడ్ నటుడు రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకు బలమైన కారణమే ఉంది. కొన్నాళ్ల కిందట దేశంలో మీటూ ఉద్యమం పతాకస్థాయిలో నడిచింది. ఆ సమయంలో క్వాన్ అనే టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లాపైనా తీవ్రస్థాయిలో మీటూ ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆ అనిర్బన్ బ్లాతో రానా డిన్నర్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న అనిర్బన్ తో రానా డిన్నర్ చేశాడంటూ ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఈ కథనం కారణంగా అనేకమంది నెటిజన్లు రానాపై విరుచుకుపడ్డారు. "సిగ్గుపడుతున్నాం రానా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రానా మండిపడ్డారు. తాను డిన్నర్ చేశానా? లేదా? అనే విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా రాస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ లేకపోతే, నా పీఆర్ టీమ్ కు ఫోన్ చేసైనా వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా? అంటూ హితవు పలికారు. సదరు పత్రిక కథనంలో పేర్కొన్నది అవాస్తవమని, ఆ సమయంలో తాను వికారాబాద్ లో చిత్రీకరణలో పాల్గొని, రాత్రికి బెంగళూరు వెళ్లి డిన్నర్ చేశానని వెల్లడించారు.

అయితే ఆ పత్రిక అంతటితో ఊరుకోలేదు. రానా, అనిర్బన్ బ్లాతో డిన్నర్ చేసినట్టు రాశామని, తాము రాసింది తప్పు అని పేర్కొంటూనే... రానాను అనిర్బన్ బ్లా విందుకు ఆహ్వానించారని, ఆ విందుకు వెళ్లాలనుకున్న రానా కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయాడని వివరించింది.

ఈ తాజా కథనంతో రానా మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ పత్రికలో పనిచేసే నమ్రతా జకారియా అనే మహిళా జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ, "మీరు చేసిందే తప్పు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తారా?" అంటూ మండిపడ్డారు. "మీ పని మీరు సరిగ్గా నిర్వర్తించండి. నా పనికి అడ్డుతగలకండి. అయినా మీదో ప్రముఖ పత్రిక... దాంట్లో చెత్త ఎందుకు రాస్తున్నారు? మీ పట్ల సిగ్గుపడుతున్నాను నమ్రతా జకారియా" అంటూ ఘాటుగా స్పందించారు.

More Telugu News