Saudi King: సౌదీ రాజు చనిపోయాడంటూ వార్తలు... అవాస్తవమంటూ ఫొటోలు విడుదల... గంటలో 30 శాతం తగ్గిన క్రూడాయిల్ ధర!

  • రాజు మరణ వదంతులతో కుదేలైన చమురు మార్కెట్
  • ఆయన విధుల్లోనే ఉన్నారంటూ ప్రకటన
  • స్వల్పంగా కోలుకున్న సూచీలు
Fake News on Saudi King

సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజీజ్ ఆల్ సౌద్ (84) మరణించారంటూ వచ్చిన వార్తలు అసలే అంతంతమాత్రంగా ఉన్న ముడి చమురు మార్కెట్ ను కుదేలు చేశాయి. ఈ ఉదయం 9.30 గంటల సమయంలో 15 శాతం వరకూ నష్టపోయిన క్రూడాయిల్ ధర, గంట వ్యవధిలో 30 శాతం దిగజారింది. విషయం తెలుసుకున్న రాజకుటుంబ పెద్దలు, ఆయన బతికే ఉన్నారని, పాలనా విధుల్లో నిమగ్నమై ఉన్నారని చెబుతూ, కొన్ని ఫొటోలను విడుదల చేశారు. అప్పటికే అటు స్టాక్ మార్కెట్ కు, ఇటు చమురు మార్కెట్ కూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రస్తుతం సౌదీ క్రూడాయిల్ ధర, క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 852 తగ్గి రూ. 2,307 వద్ద కొనసాగుతోంది. ఇది శనివారం నాటి ధరతో పోలిస్తే 27 శాతం తక్కువ. అంతకుముందు 33 శాతం వరకూ ధర పతనమైనప్పటికీ, రాజు బతికే ఉన్నారన్న వార్తలు నష్టాన్ని తగ్గించాయి. మరోవైపు బులియన్ మార్కెట్, తన నష్టాన్ని తగ్గించుకుని, లాభాల దిశగా సాగుతోంది. పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి 44,255కు చేరింది.

More Telugu News