KCR: ‘తెలంగాణ’లో ఎవరికీ ‘కరోనా’ లేదు.. రానివ్వం కూడా!: సీఎం కేసీఆర్​

  • అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం కానీ, ‘కరోనా’ను రానివ్వం
  • ఒకవేళ ‘కరోనా’ వచ్చినా భయపడొద్దు.. పారాసిటమాల్ చాలు
  • ఇరవై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ఆ వైరస్ చనిపోతుంది
CM KCR says no corona virus in Telangana state

తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు చేస్తాం కానీ, ‘కరోనా’ను మాత్రం రానివ్వమని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ‘కరోనా’ కనుక వ్యాపిస్తే తమ సర్వ శక్తులు ఒడ్డి ఎదుర్కొంటామని, శాసనసభా సమావేశాలు రద్దు చేసి, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు మాస్క్ లు కట్టుకోకుండానే పని చేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మాస్క్ ల కొరత ఉందన్న కాంగ్రెస్ సభ్యురాలు అనసూయ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా కేసీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.  

‘కరోనా’ వస్తే భయపడాల్సిన పని లేదని, ‘పారాసిటమాల్ గోలి’ వేసుకుంటే సరిపోతుందని ఇటీవల తనకు ఫోన్ చేసిన ఓ సైంటిస్ట్ చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ టైమ్ లో ‘తెలంగాణ’కు ‘కరోనా’ వ్యాపించదని, ఇరవై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ఆ వైరస్ నశించిపోతుందని, ఈ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలకు చేరుతోంది కనుక  భయపడాల్సిన అవసరం లేదని ఆ సైంటిస్ట్ చెప్పారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ గురించి ప్రస్తావిస్తూ, ఇది అద్భుతమైన పథకం అని, హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉండే కోటీశ్వరులు ఎలాంటి స్వచ్ఛమైన నీరు తాగుతారో, ఆదిలాబాద్ లోని గోండు గూడెంలో, నల్గొండలోని లంబాడీ తండా,  ఖమ్మంలోని కోయగూడెంలో కూడా అవే నీళ్లు తాగుతున్నారని, మిషన్ భగీరథ ద్వారా అది సాధ్యమైందని చెప్పారు.

More Telugu News