Prime Minister: కేజ్రీవాల్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నా
  • ప్రతిగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేజ్రీవాల్ ట్వీట్
  • ఢిల్లీ నగర అభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేస్తానన్న ఢీల్లీ సీఎం
PM modi greetings to kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో  సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ, పశ్చిమబెంగాల్, కేరళ, బీహార్ తదితర రాష్ట్రాల సీఎంలు కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు సీఎం కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మీరు ఉన్నతంగా పనిచేస్తారని ఆశిస్తున్నా’ అంటూ మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రతిగా కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేస్తూ.. మీకు ధన్యవాదాలు.. ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తాను అని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది.

More Telugu News