రేపటి ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టులో నిర్భయ దోషి మరో రివ్యూ పిటిషన్

  • నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని ఇటీవల పవన్ పిటిషన్‌
  • ఆ పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ  రివ్యూ పిటిషన్‌ 
  • తీర్పును పునఃసమీక్షించాలని వినతి
'నిర్భయ' కేసులో దోషులను రేపు తిహార్‌ జైల్లో ఉరి తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పిటిషన్‌లు వేసి ఉరి శిక్ష అమలులో జాప్యమయ్యేలా చేసుకున్న దోషులు తమ ప్రయత్నాలను చివరి గంటల్లోనూ కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో దోషి పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ వేశాడు.

నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ నని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ అతడు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తీర్పును పునఃసమీక్షించాలని, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. నిర్భయ కేసులో ముగ్గురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఇటీవలే డెత్‌ వారెంట్‌ ఇచ్చింది. దాని ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది.

మరోవైపు, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని, దోషులందరూ న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునేవరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ ఢిల్లీ కోర్టులో నిన్న దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తిహార్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Nirbhaya
New Delhi
Supreme Court

More Telugu News