ఆనందంగా పదవులు వదిలేసుకుంటాం: ఏపీ మంత్రులు పిల్లి సుభాష్, మోపిదేవి!

  • శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం
  • స్వాగతిస్తున్నామన్న వైసీపీ మండలి సభ్యులు
  • విస్తృత ప్రయోజనాల కోసమే నిర్ణయమన్న పిల్లి
అభివృద్ధిని అడ్డుకుంటూ, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన శాసనమండలిని రద్దు చేయాలన్న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్ కోసం తమ మంత్రి పదవులను వదిలేసుకునేందుకు సిద్ధమేనని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన వారిద్దరూ, మండలిలో సభ్యులుగా ఉండటం ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు. గతంలో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న వేళ, స్వల్ప ప్రయోజనాల కోసం రామోజీరావు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి, మండలిని రద్దు చేశారని, కానీ ఇప్పుడు విస్తృత ప్రయోజనాల కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పిల్లి సుభాష్ వ్యాఖ్యానించారు. అందరికీ నచ్చిన చోట రాజధాని పెట్టాలని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పగా, ఆ మాటను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలను సరిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

మండలిలో సభ్యులుగా ఉన్న తాము పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. పెద్దల పేరు చెప్పుకుని అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ఇటువంటి సభ ఉండటానికి వీల్లేదని, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల చట్ట సభల్లోని సభ్యులు ప్రజల ముందు తల దించుకుని నిలబడాల్సి వస్తోందని దుయ్యబట్టిన ఆయన, తమ పార్టీ నుంచి గుర్తింపు పొందిన వ్యక్తులు మండలిలో ఉండగా, చంద్రబాబు మాత్రం దోపిడీదారులను మండలికి పంపారని విమర్శించారు.
Go Back to Shorts
AP Legislative Council
Disolve
Mopidevi Venkataramana
Pilli Subhas Chandra Bose
Jagan

More Telugu News