బాగ్దాదీని హతమార్చడంతో ఐసిస్ కథ ముగిసిపోదు: ఆస్ట్రేలియా కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి

  • బిన్ లాడెన్ ను చంపిన తర్వాత కూడా ఆల్ ఖాయిదా అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయి
  • ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపాలి
  • 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి
ఐసిస్ అధినేత బాగ్దాదీని హతమార్చినంత మాత్రాన ఆ ఉగ్ర సంస్థ అంతరించిపోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అస్టేలియాలోని మెల్ బోర్న్ లో జరుగుతున్న 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 కాన్ఫరెన్స్ కు హాజరైన 65 దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అల్ ఖాయిదా అధినేత బిన్ లాడెన్ అమెరికా హతమార్చిన తర్వాత కూడా ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న పలు సంస్థలు ఇంకా పని చేస్తూనే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, బాగ్దాదీ మరణం తర్వాత ఆ సంస్థ పని అయిపోయిందని భావించడం పొరపాటు అవుతుందని చెప్పారు.

ఉగ్ర సంస్థలకు కొన్ని దేశాలు అందిస్తున్న సహాయంపై ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న ఇలాంటి దేశాలకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాల్సి ఉందని సూచించారు. ఉగ్రవాదుల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో నష్టపోయిందని... ఈ నేపథ్యంలో, ఉగ్రవాదంపై అందరూ ఉక్కుపాదం మోపాలని కోరుతోందని చెప్పారు. 2020లో జరిగే 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ ను భారత్ నిర్వహిస్తుందని ప్రకటించారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ కు ఐదుగురు సభ్యుల హై పవర్డ్ డెలిగేషన్ హాజరైంది. వీరిలో ఎన్ఐఏ డెరెక్టర్ జనరల్ వైసీ మోదీ కూడా ఉన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
No Money for Terror Conference
Australia
Terrorishm
Osama Bin Laden
Abu Bakr al Baghdadi

More Telugu News