Congress: గెలుపు కోసం టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడింది: పొన్నం ప్రభాకర్

  • ప్రజాస్వామ్యం ఓడింది.. ధనస్వామ్యం గెలిచింది
  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే
  • భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం
హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఉపఎన్నికలో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఓటమితో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, ధనస్వామ్యం గెలిచినట్టుగా భావిస్తున్నామని అన్నారు.

ఈ ఎన్నికలో తాము ఓడిపోయామని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూ.. ‘టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడింది’ అని ఆరోపించారు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణలో భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News

Congress
ponnam
TRS
Huzurunagar
Telangana