చిరంజీవిని సీఎం జగన్ లంచ్ కు పిలిచారు: బొత్స
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చిరంజీవి సినిమాపరమైన కారణంతోనే సీఎంను కలుస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కోణాలకు తావులేదని తన వ్యాఖ్యలతో తేల్చిచెప్పారు. చిరంజీవిని లంచ్ కు రావాల్సిందిగా సీఎం జగన్ పిలిచారని బొత్స వెల్లడించారు. వాస్తవానికి సీఎం జగన్ తో చిరంజీవి భేటీ ఈ ఉదయం జరగాల్సి ఉంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా జగన్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే సీఎం కార్యాలయం చిరంజీవికి ఈ నెల 14న అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సైరా చిత్రం విజయం సాధించడంతో చిరంజీవి ఉత్సాహంగా ఉన్నారు. సైరా మూవీని వీక్షించాల్సిందిగా చిరు సీఎం జగన్ ను కోరే అవకాశాలున్నాయి.