Andhra Pradesh: చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను దించారు.. విచారణ జరిపితే నిజాలు బయటకొస్తాయి!: వైసీపీ నేత రోజా

  • వరదలనూ టీడీపీ రాజకీయం చేస్తోంది
  • రైతులు సంతోషంగా ఉంటే బాబు తట్టుకోలేకున్నారు
  • పడవలతో వరదను ఆపగలిగితే ఇక డ్యాములు ఎందుకు?
తెలుగుదేశం పార్టీ వరదలను కూడా రాజకీయం చేస్తోందని ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోయాయని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు పెడితే కరువే అనే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు. ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రిజర్వాయర్లు అన్నీ నిండిపోయి రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే ఇది చూసి తట్టుకోలేకపోయిన చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని దుయ్యబట్టారు.

వాళ్లను నీళ్లలో నిలబెట్టి మాట్లాడిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ వీడియోల్లో మాట్లాడుతున్న మనుషులు ఎవరో విచారణ చేస్తే నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆశావర్కర్లు ధర్నా చేస్తే ఆ ఫొటోను కూడా టీడీపీ నేతలు జగన్ కు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ చెప్పినట్లు ఓ పడవతో వరద నీటిని ఆపగలిగితే వేలాది కోట్లు పెట్టి డ్యాములు కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోకేశ్ తన తెలివితక్కువతనాన్ని ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నాడని రోజా విమర్శించారు.

More Telugu News

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
roja
Roja