కశ్మీర్ అంశంపై మరోసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- కశ్మీర్ సమస్యను ఇండియా-పాక్ లు కలసికట్టుగా పరిష్కరించుకోవాలి
- నా సహకారం కోరితే మధ్యవర్తిత్వం వహిస్తా
- ఇది మోదీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది
కశ్మీర్ సమస్యను ఇండియా-పాకిస్థాన్ లు కలసికట్టుగా పరిష్కరించుకోవాలని... తన సహకారం కావాలని ఆ రెండు దేశాలు కోరితే, మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ చెప్పారు. తన ఆఫర్ ను అంగీకరించడమా? లేదా? అనేది మోదీపైనే ఆధారపడి ఉందని చెప్పారు. మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ మంచి వ్యక్తులని... వారిద్దరూ కలసి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారనే నమ్మకం తనకుందని తెలిపారు. ఏ వ్యక్తి సహకారాన్నైనా కావాలని వారు కోరుకుంటే, దానికి తాను సిద్ధమని... ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తో తాను చాలా సిన్సియర్ గా చెప్పానని అన్నారు. వారిద్దరూ తన మధ్యవర్తిత్వాన్ని కోరితే... తప్పకుండా కశ్మీర్ అంశంలో కలగజేసుకుంటానని చెప్పారు.
జూన్ లో జపాన్ లో జరిగిన జీ-20 సమ్మిట్ లో కశ్మీర్ విషయంలో కలగజేసుకోవాలని మోదీ తనను కోరినట్టు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి లోక్ సభలో మాట్లాడుతూ, మోదీ, ట్రంప్ లు చర్చిస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని... మోదీ నుంచి ట్రంప్ కు అలాంటి ప్రతిపాదన వెళ్లలేదని స్పష్టం చేశారు.