నేడు రెండు విడతలుగా ఏపీ అసెంబ్లీ!
- నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం
- ప్రశ్నోత్తరాల అనంతరం సభ వాయిదా
- తిరిగి మధ్యాహ్నం తరువాత సమావేశం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండు విడతలుగా జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆపై ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం వరకూ ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఆపై జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు నేరుగా రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరంతా వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి అవే బస్సుల్లో సీఎంతో పాటు మిగతా వారంతా అసెంబ్లీకి చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం తరువాత ఉభయ సభల సమావేశాలు ప్రారంభం అవుతాయి.