ఒక్కసారి రికార్డులు తిరగేయండి.. రౌడీలు ఎవరో, హంతకులు ఎవరో తెలుస్తుంది!: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
- జగన్ శాడిజంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు
- అవినీతితో పైకొచ్చిన నాయకులే అబద్ధాలు చెబుతారు
- మీడియా పాయింట్ లో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యాక్షనిజంతో, శాడిజంతో కూడుకున్న నిర్ణయాల్లాగే అనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ‘మేం 151 మంది ఉన్నాం. మీ సంగతి చూస్తాం. చేతులు విరుస్తాం. మీరు ఇక్కడ ఉంటారా? అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి చేతులు ఎవరు విరుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. మాట తప్పం-మడమ తిప్పం అన్న ముఖ్యమంత్రి ఈరోజు అన్నీ అబద్ధాలే చెబుతున్నాడు. నాయకులు సచ్ఛీలురైతే నిజాలు చెబుతారు.
అవినీతి ద్వారా పైకొచ్చిన నాయకులే అబద్ధాలు చెబుతారు. అధికార పక్ష సభ్యులే పోడియంలోకి దూసుకొచ్చి సభను వాయిదా వేయించారు. మాట తప్పని-మడమ తిప్పని ముఖ్యమంత్రికి రక్షణగా సభను వాయిదా వేయించారు. మేం రౌడీలమని జగన్ అన్నారు. మేమేమన్నా రౌడీలమా? ఓసారి రికార్డులు తిప్పి చూస్తే రౌడీలు ఎవరో, హంతకులు ఎవరో తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి.’ అని సీఎం జగన్ కు హితవు పలికారు.