"మీ వద్ద ఉన్న అస్త్రాన్ని తీయండి సార్"... "నా వద్ద ఎలాంటి అస్త్రంలేదు, కలం మాత్రం ఉంది!".. గవర్నర్, షబ్బీర్ అలీ మధ్య సరదా సంభాషణ

  • గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు
  • ఇంటర్ ఫలితాలపై, పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు
  • షబ్బీర్ అలీ సూచన, గవర్నర్ చమత్కారం
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు, ఇంటర్ ఫలితాల వ్యవహారంపై చర్చించేందుకు అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను గవర్నర్ కు నివేదించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మీ దగ్గర ఉన్న అస్త్రాన్ని తీయండి సార్ అని కోరారు. దానికి గవర్నర్ బదులిస్తూ, "నా వద్ద అస్త్రంలేదు, కలం మాత్రం ఉంది" అంటూ చమత్కరించారు. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి.

అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ప్రస్తుత పరిణామాల పట్ల గవర్నర్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీని నామరూపాల్లేకుండా చేయాలనుకుంటున్నారని వాపోయారు. దీనిపై నరసింహన్ స్పందిస్తూ, తాను ఇలాంటి విషయాలపై బహిరంగంగా స్పందించలేనని, పార్టీ ఫిరాయింపులపై తగిన సమయంలో మాట్లాడతానని కాంగ్రెస్ నేతలతో చెప్పారు.
Go Back to Shorts
Telangana

More Telugu News