ఏలూరులో ‘బీసీ గర్జన’ సభ.. అమరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్ జగన్
పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు వైసీపీ అధినేత జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభకు కొద్ది సేపటి క్రితం జగన్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న జగన్ తొలుత మహాత్మారావు ఫూలే విగ్రహానికి పూల దండ వేశారు. అనంతరం, వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి.. నివాళులర్పించారు. కాగా, ‘బీసీ గర్జన’ సభకు 13 జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సభకు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యా కూడా హాజరయ్యారు.