కశ్మీర్ వ్యవహారంలో పాక్ జోక్యం మానుకోవాలి: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ
- కశ్మీర్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమే
- అక్కడి వాళ్లందరూ భారత ప్రజలే
- నలుగురినీ ఆలోచింపజేసేలా నా ప్రసంగాలు ఉంటాయి
కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, కశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యం మానుకోవాలని, కశ్మీర్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలు, యువత భారత ప్రజలేనని అన్నారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ వచ్చే విమర్శలపై ఆయన స్పందిస్తూ, నలుగురినీ ఆలోచింప జేసేందుకే తాను ఆ విధంగా ప్రసంగిస్తానని సమర్ధించుకున్నారు.