Kamaladevi: పామర్రు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కమలాదేవి కన్నుమూత!

  • ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • 1972లో ఎమ్మెల్యేగా గెలిచిన కమలాదేవి
  • సంతాపం తెలిపిన పలువురు సీనియర్ నేతలు
కాంగ్రెస్ మహిళా నేత, తూర్పు గోదావరి జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె, కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమెకు రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అనురాధ అనే కుమార్తె ఉన్నారు.

కమలాదేవి 1972లో పామర్రు నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, టీటీడీ బోర్డులో మెంబర్ గా, క్వాయర్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు. కాకినాడలో టీటీడీ కల్యాణ మండపాన్ని మంజూరు చేయించడంలో తనదైన పాత్ర పోషించిన ఆమె, అప్పట్లో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కమలాదేవి మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.
Kamaladevi
Pamarru
Died
Congress
MLA

More Telugu News