Guntur District: అందుకే రాజీనామా చేశాను: గుంటూరులో లక్ష్మీ నారాయణ

షార్ట్స్‌లో చూడండి
రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని తాను మహారాష్ట్ర సర్కారుని కోరానని, అయితే, తాను ఐపీఎస్‌ అయినందున ప్రభుత్వం తనకు ఆ అవకాశం కల్పించలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. అందుకే తాను ఉద్యోగం వదిలేసి రైతు సేవ చేయడానికి బయటికి వచ్చానని వివరించారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని యాజలి గ్రామంలో లక్ష్మీ నారాయణ రైతులతో మాట్లాడుతూ... తాను ఒకవేళ వ్యవసాయ మంత్రి అయితే ఏమి చేయొచ్చో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని సరదాగా వ్యాఖ్యానించారు.

అలాగే, ఒకవేళ వ్యవసాయ శాఖ మంత్రిని కాకపోతే సామాజిక కార్యకర్తగా రైతులకు ఏం చేయాలన్న విషయం ఆలోచించడానికే ఇక్కడకు వచ్చానని లక్ష్మీ నారాయణ అన్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మంచి విత్తనాలన్నింటినీ నార్వే రైతులు, పరిశోధకులు సేకరిస్తున్నారని, అందుకోసం పెద్ద పెద్ద గోడౌన్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు.

ప్రపంచం మొత్తానికి విత్తనాలు సరఫరా చేసే విధంగా ఎదగాలని నార్వేలాంటి చిన్న దేశం గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతోందని తెలిపారు. మన రైతులు కూడా సంఘటితం కావాలని, మనం ఎక్కువగా క్రిమి సంహాక మందులు వాడుతున్నామని అది సరైంది కాదని అన్నారు. మంచి ప్రయత్నానికి కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారని, అవి అధిగమించుకుని వెళ్లాల్సి ఉందని చెప్పారు.

అన్నదాతలు బ్రహ్మాండంగా ఉంటేనే దేశం బాగుంటుందని, మన అడుగు యాజలి నుంచి ప్రారంభమైందని, రైతుల వెనుక తాము ఉంటామని లక్ష్మీ నారాయణ అన్నారు. కష్టం, ఆనందం, ధైర్యం ఉండే వాడే రైతు అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Guntur District
laxmi narayana
farmers

More Telugu News