ఆధార్ లేదా ఓటరు కార్డుతో రండి, రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం: టీటీడీ

  • టైమ్ స్లాట్ విధానం ప్రారంభం
  • 100కు పైగా స్లాట్ కేటాయింపు కేంద్రాల ఏర్పాటు
  • మే తొలి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు
ఎంతో వ్యయ ప్రయాసలతో తిరుమల గిరులకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం పాటు దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే అవసరం ఇక ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం ఈ ఉదయం ప్రారంభమైంది. దీని ప్రకారం ఓ భక్తుడు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎన్ని గంటలకు రావాలన్న విషయాన్ని ముద్రిస్తూ, అధికారులు బయో మెట్రిక్ కూపన్ అందిస్తారు. దీన్ని తీసుకుని ఆ సమయానికి లోనికి వెళితే రెండు నుంచి మూడు గంటల్లోపే స్వామిని దర్శించుకుని బయటకు రావచ్చు.

ఈ కూపన్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి. ఈ సంవత్సరం మొదట్లో సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన టీటీడీ, భక్తుల అభిప్రాయాలను కోరిన వేళ, ఈ పద్ధతి బాగుందన్న సమాధానం వచ్చింది. ఆపై మరింత పకడబ్బందీగా ఈ విధానాన్ని తయారు చేసి, అధునాతన కంప్యూటర్ల సాయంతో, 100కు పైగా టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను తిరుమల, తిరుపతిలలోని పలు ప్రాంతాల్లో ఎంపిక చేశారు. ప్రస్తుతం నిర్దేశిత సమయంలో టైమ్ స్లాట్ ను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించామని, మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ పొందని భక్తుల కోసం సర్వదర్శనం క్యూలైన్ తెరిచే ఉంటుందని అన్నారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Time Slot
Lord Venkateshwara

More Telugu News