కువైట్‌లో రెండు బస్సులు ఢీ.. ఏడుగురు భారతీయుల దుర్మరణం

  • బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో ప్రమాదం
  • విధులు ముగించుకుని కార్మికులు ఇంటికొస్తుండగా ఘటన
  • మొత్తం 15 మంది మృతి
కువైట్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో అల్-అర్టల్ రోడ్డుపై రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ (కేఎఫ్ఎస్‌డీ) తెలిపింది. కార్మికులతో బయలుదేరిన రెండు బస్సులు ఢీకొన్నాయని, ఈ ఘటనలో మొత్తం 15 మంది చనిపోయారని కువైట్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీరిలో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు.

ఘటనలో గాయపడిన మరో ఇద్దరిలో ఒకరు భారతీయుడు కాగా, మరో వ్యక్తి కువైట్ కి చెందిన వాడని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులో నలిగిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Kuwait
Bus
Road Accident

More Telugu News