మమ్మల్ని ఎప్పుడు నమ్మారు? వాడుకొని దూషణలా?: ట్రంప్ వ్యాఖ్యాలపై పాక్ మండిపాటు

  • ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన పలువురు పాక్ నేతలు
  • ఉచితంగా భూమి ఇచ్చామన్న రక్షణ మంత్రి
  • అపనమ్మకాన్ని పెంచుకున్న అమెరికా
  • దూషణలకు దిగుతోందని ఆరోపించిన నేతలు
అమెరికా గత పాలకులు మూర్ఖంగా వ్యవహరించి పాకిస్థాన్ కు వేల కోట్ల రూపాయల సహాయాన్ని చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. దీనిపై స్పందించిన పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్, ప్రపంచానికి అసలు వాస్తవాన్ని తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. ఇదే విషయమై పాక్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మాట్లాడుతూ, అమెరికాకు తాము ఉచితంగా భూమిని ఇచ్చామని, సైనిక స్థావరాలను, ఇంటెలిజెన్స్ వర్గాలను అమెరికా వాడుకుందని, 16 సంవత్సరాలుగా తమ సాయాన్ని తీసుకుంటూ, తమపై అపనమ్మకాన్ని పెంచుకున్న అమెరికా, ఇప్పుడు దూషణలకు దిగుతోందని ఆరోపించారు.

పాకిస్థానీలను హత్యలు చేస్తున్న సీమాంతర ఉగ్రవాద స్వర్గధామాలను అమెరికా విస్మరించిందని, భారత్ పేరు చెప్పకుండా ఆయన ఆరోపించారు. ఇక పాక్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మరియమ్ ఔరంగజేబ్ మాట్లాడుతూ, తమదేశం అమెరికా కోసం ఎన్నో త్యాగాలను చేసిందని అన్నారు. ఆఫ్గనిస్థాన్ లో విఫలమైన అమెరికా, తమ వైఫల్యాన్ని పాక్ పై నెట్టేందుకు చూస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
Go Back to Shorts
Donald Trump
Pakistan
Afghanisthan

More Telugu News