బీజేపీతో కలిస్తే జగన్ మటాషే: ఉండవల్లి

  • రాష్ట్రానికి ఇలాంటి సీఎం ఉండటం దురదృష్టకరం
  • కేంద్రం వద్ద తలొగ్గిన బలహీనుడు చంద్రబాబు
  • ఏడాదిన్నరగా మోదీతో మాట్లాడలేని బాబు
  • ఉండవల్లి అరుణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు 
రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేకపోతున్న చంద్రబాబు సీఎంగా ఉండటం దురదృష్టకరమని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. గత ఏడాదిన్నరగా చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన, ఈ విషయంలో చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని, ఆయనకు బల్లగుద్ది మోదీతో వాదించేంత ధైర్యం లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లేకుంటే ఏపీ రాష్ట్రమే లేదని అభిప్రాయపడ్డ ఆయన, ఈ ప్రాజెక్టుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని కనీసం ఊహించలేకపోతున్నానని అన్నారు.

చంద్రబాబు ఇలా ఎందుకు తలొగ్గి బలహీనుడు అయిపోయాడో అసలైన కారణం తెలియడం లేదని చెప్పారు. ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బీజేపీతో జగన్ కలిసి వెళితే మటాష్ అయిపోతారని, ఆయనకు ఉన్న మైనారిటీ, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు దూరమవుతుందని హెచ్చరించారు. 2014లో తొలుత జగన్ ను సంప్రదించి, అక్కడ పొత్తు కుదరకనే, చంద్రబాబు వైపు బీజేపీ వచ్చిందని, ఈ విషయం తనకు తెలుసునని వ్యాఖ్యానించిన ఉండవల్లి, పొత్తుల విషయమై జగన్ కు సలహాను ఇచ్చే శక్తి తనకు లేదని అన్నారు. తనతో పాటు కేవీపీ తదితర కాంగ్రెస్ నేతలు, జగన్ ను అధికారంలోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Undavalli Arunkumar
Jagan
Chandrababu
BJP
YSRCP
Telugudesam

More Telugu News