ఆరుషి కేసులో తల్లిదండ్రులు నిర్దోషులు.. సంచలన తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు!
- ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు
- సరైన ఆధారాలు చూపించలేకపోయిన సీబీఐ
- జైలు నుంచి విడుదలకానున్న తల్వార్ దంపతులు
2008 మే 16న ఆరుషి తన బెడ్రూంలో హత్యకు గురైంది. మొదట వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసుంటాడని అనుమానపడ్డారు. రెండ్రోజుల తర్వాత హేమరాజ్ శవం కూడా ఆరుషి ఇంటి మీద కనిపించడంతో ఈ రెండు హత్యలు ఎవరు చేసుంటారోనన్న సందిగ్ధం ఏర్పడింది. చివరికి ఆరుషి తల్లిదండ్రులు ఈ హత్యలు చేసుంటారని భావించి సీబీఐ వారిని అరెస్టు చేసి అభియోగ పత్రాలు దాఖలు చేసింది.
విచారణ అనంతరం సీబీఐ న్యాయస్థానం ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా పేర్కొంటూ 2013లో వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు నేడు తీర్పునిచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.