నిప్పులు మూటగట్టిన భక్తుడు

నిప్పులు మూటగట్టిన భక్తుడు
శివుడిని ఆరాధించిన భక్తులు ... శివానుగ్రహం పొందిన భక్తులు ఎందరో వున్నారు. వాళ్లు తమకి ఎదురైన సంఘటనలను బట్టి ... సందర్భాలను బట్టి తమ నిజభక్తిని చాటుకున్నారు. అలాంటివారిలో 'శ్రీపతి పండితుడు' ముందువరుసలో కనిపిస్తాడు. శ్రీపతి పండితారాధ్యుడు ... శివలెంక మంచన పండితారాధ్యుడు .. మల్లికార్జున పండితారాధ్యుడు 'పండిత త్రయం'గా ప్రసిద్ధి చెందారు. వీరిలో మొదటివాడైన శ్రీపతి పండితారాధ్యుడు ఒకప్పుడు విజయవాటికాపురంగా పిలవబడిన నేటి విజయవాడలో నివసించినట్టు చరిత్ర చెబుతోంది.

వీరశైవాన్ని విశ్వసించిన శ్రీపతి ఎంతటి పండితుడో అంతటి శివభక్తుడు. అలాంటి ఆయన వైఖరిని ఒకసారి బ్రాహ్మణులంతా తప్పుబట్టారు. తన భక్తిని వారు శంకించడం ఆయనకి బాధ కలిగించింది. దాంతో తన శివభక్తిని వారికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో నిప్పులను పట్టువస్త్రంలో మూటగట్టాడు. ఆ నిప్పుల మూటను జమ్మిచెట్టుకు వ్రేలాడదీసి, దానిని కిందికి దింపేవరకూ ఆ ఊళ్లో ఎక్కడా నిప్పురాజుకోదని చెప్పాడు. నిప్పులు మూట కాలకుండా అలాగే వుండటం, ఊళ్లో ఎవరు ఎంతగా ప్రయత్నించినా నిప్పురాజుకోకపోవడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

దాంతో వాళ్లంతా వచ్చి తమ తప్పును మన్నించవలసిందిగా కోరడంతో ఆయన శాంతించాడు. జమ్మిచెట్టు నుంచి ఆయన నిప్పులమూట కిందికి దింపిన తరువాతే ఊళ్లోని బ్రాహ్మణుల పొయ్యిల్లో నిప్పురాజుకుంది. ఆయన శివభక్తిని ప్రశంసిస్తూ వాళ్లంతా ఆయనకి వినయంగా నమస్కరించి వెనుదిరిగారు.

More Bhakti Articles