ఆలయ దర్శనం

ఆలయ దర్శనం
ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవం తమకి అండగా ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది. ఆ నమ్మకం ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది ... అనూహ్యమైన విజయాలను అందిస్తుంది. అది దైవానుగ్రహంగానే భావించి ఆలయానికి వెళ్లి దైవానికి కృతజ్ఞతలు తెలియజేయడం ... కానుకలు సమర్పించడం జరుగుతుంది. ఇలా మనిషికీ దైవానికి మధ్య విడదీయరాని బంధం పెరిగిపోతూ వుంటుంది.

అయితే దైవం పట్ల ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నప్పటికీ, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పని సరిగా కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ పూజ పూర్తయిన తరువాత ఆలయానికి చేరుకోవాలి. భోజనం చేసి ... తాంబూలం వేసుకుని ఆలయానికి వెళ్లకూడదు.

దైవానికి పూలు - పండ్లు తీసుకెళ్లడం ఎలాంటి పరిస్థితుల్లోను మరిచిపోకూడదు. ఆలయ ప్రవేశానికి ముందుగా కాళ్లు - చేతులు పరిశుభ్ర పరచుకుని ప్రాంగణంలోకి అడుగుపెట్టాలి. ముందుగా మూడు ప్రదక్షిణలు చేసి ప్రధాన మంటపంలోకి ప్రవేశించాలి. ఆలయంలో ఏర్పాటుచేయబడిన కుంకుమను నుదుటున ధరించి, ఆ తరువాత తమ గోత్రనామాలు చెప్పి పూజ చేయించాలి. పూజ సమయంలో దృష్టి - మనసు దైవంపైనే ఉంచాలి.

దేవాలయంలో పెద్దగా అరవడం గానీ, ఇతరులతో గొడవపడటం గాని చేయకూడదు. దైవానికి ఎదురుగా నుంచుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం గానీ, చూపుడు వ్రేలుతో దైవాన్ని ఇతరులకు చూపించడంగాని చేయకూడదు. తమ వలన ఆలయంగానీ ... పరిసరాలుగాని అపరిశుభ్రం కాకుండా జాగ్రత్తపడాలి. ఇలా నియమబద్ధంగా ఆలయ దర్శనం చేయడం వలన ఎలాంటి దోషాలు లేకుండా పుణ్య ఫలాలతో ఇంటికి తిరిగి వచ్చినట్టు అవుతుంది.

More Bhakti Articles