శ్రీ లలితా సోమేశ్వర క్షేత్రం

శ్రీ లలితా సోమేశ్వర క్షేత్రం
పరమశివుడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో 'సోమశిల' ఒకటి. భక్తులపాలిట కామధేనువు ... కల్పతరువుగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో విలసిల్లుతోంది. 12 వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చిన 'శ్రీ లలితా సోమేశ్వరస్వామి' ఆలయం, ఒకప్పుడు సంగమేశ్వర క్షేత్రం సమీపంలో ఉండేదట. ఆ తరువాత కాలంలో శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆలయాన్ని ఇక్కడ పునః నిర్మించినట్టు చెబుతారు.

ద్వాపరయుగంలో భీముడు ప్రతిష్ఠించిన అయిదు శివలింగాలలో ఇది ఒకటి అని స్థల పురాణం చెబుతోంది. చాళుక్యులు ఆలయ అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషించినట్టు ఆధారాలు వున్నాయి. ఎటుచూసినా నల్లమల పర్వత శ్రేణులు ... ప్రశాంతంగా ప్రవహిస్తోన్న కృష్ణానది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటాయి. ప్రాచీన వైభవానికి ప్రతీకగా కనిపిస్తోన్న ఈ ఆలయంలో, సోమేశ్వరస్వామితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తూ వుంటాయి.

ఆలయం ముఖమంటపంలోని స్తంభాలు ... పైకప్పు శిల్పకళా శోభితమై అలరారుతూ వుంటాయి. గర్భాలయంలో సోమేశ్వరుడు ... ఆ పక్కనే గల మందిరంలో శ్రీ లలితాదేవి పూజలు అందుకుంటూ వుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో శ్రీ కామాక్షీ అమ్మవారు .. హనుమంతుడు .. నవగ్రహాలు కొలువుదీరి వుంటారు. ఆధ్యాత్మిక ... చారిత్రక వైభవాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్రదర్శనం, అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.

More Bhakti Articles