పూజలేని దేవుడు?

పూజలేని దేవుడు?
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానం ఎంతో విశిష్టమైనది. ఇక్కడి ప్రజల జీవితం దేవుడితో ముడిపడి వుంటుంది. అనివార్య కారణాల వలన దేవుడికి ఒక రోజు అభిషేకం చేయలేకపోయినా, ఏదో ఒక రోజున నైవేద్యం పెట్టలేకపోయినా ఆ రోజంతా మనసు కష్టపెట్టుకునేవారెందరో వున్నారు.

అత్యవసరమైన పనిమీద మరో ఊరు వెళుతున్నప్పుడు, లేదంటే తీర్థ యాత్రాలకే వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇంట్లో దేవుడికి దీపారాధన ... నైవేద్యం ఎట్లా అని కొంతమంది ఆలోచిస్తూ వుంటారు. తమ దేవుడిని ఉపవాసం వుంచడం ఇష్టం లేక ఎక్కడికీ కదలని వాళ్లు కూడా ఎందరో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన పూర్వీకులు దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే, ధాన్యం ఉంచిన పాత్రలో పూజ మందిరంలోని విగ్రహాలను వుంచి వెళ్లేవారు.

తిరిగి వచ్చాక ఆ విగ్రహాలకు పూజాభిషేకాలు నిర్వహించి, ఆ ధాన్యంతో నైవేద్యాన్ని తయారుచేసి సమర్పించేవారు. ఈ విధంగా చేయడం వలన కొన్ని రోజులపాటు దీపారాధన చేయని దోషం ... నైవేద్యం పెట్టని దోషం అంటదని చెబుతుంటారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తూనే వుండటం విశేషం.

More Bhakti Articles