శ్రీ పళ్ళాలమ్మ క్షేత్రం

శ్రీ పళ్ళాలమ్మ క్షేత్రం
జగజ్జనని అయిన అమ్మవారు అనేక రూపాల్లో వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవించింది. గ్రామదేవతగా అవతరించి ప్రజలను కన్న బిడ్డల మాదిరిగా కాపాడుతూ వస్తోంది. సాక్షాత్తు పార్వతీ దేవి గ్రామదేవతగా అవతరించగా, ఆమె ప్రతిమను సీతాదేవి ప్రతిష్ఠించడం మరో విశేషం.

సీతా రాములు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ అమ్మవారిని సీతమ్మ తల్లి ప్రతిష్ఠించి వివిధ రకాల పండ్లను సమర్పించిందట. ఈ కారణంగానే ఇక్కడి అమ్మవారిని 'పళ్ళాలమ్మ'గా పిలుస్తుంటారు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం మనకి తూర్పు గోదావరి జిల్లా - రావులపాలెం సమీపంలోని 'వానపల్లి' లో దర్శనమిస్తుంది.

వనవాస సమయంలో సీతారాములు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ వుంటే, ప్రతి రాత్రి వేళ నక్కలు గుంపులుగా వచ్చి వారికి ఇబ్బందిని కలిగించేవట. దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఆ నక్కలను తరిమేయడమే కాకుండా ఓ నక్కను తొక్కిపట్టి ఇక్కడ ఆవిర్భవించింది. తమ ఇబ్బందిని అమ్మవారు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతగా సీతమ్మ వారు ఆ తల్లి ప్రతిమను ప్రతిష్ఠించింది.

నక్కను తొక్కి పెట్టిన ఈ అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇక పళ్ళాలమ్మ వారు ఒక నూతి గట్టుపై కొలువుదీరి కనిపిస్తుంది. వర్షాకాలంలో అమ్మవారు ఈ నూతిలో సగం వరకూ మునిగి కనిపిస్తూ ఉంటుంది. 'కాటన్ దొర' ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన పథకం సిద్ధం చేసుకుంటూ ఇక్కడి ఆలయాన్ని పక్కకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి అమ్మవారు కలలో కనిపించి బ్యారేజ్ ఎక్కడ ఎలా నిర్మిస్తే బాగుంటుందనేది చెప్పిందని అంటారు.

ప్రతియేటా అమ్మవారికి చైత్ర పౌర్ణమి వెళ్ళిన సోమవారం రోజు నుంచి నెలపాటు గరగలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే వైశాఖ మాసంలో సోమవారం నుంచి 'సిరిపండి' ఉత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహానికి పాత్రులవుతూ వుంటారు.

More Bhakti Articles