శిరిడీ సాయి క్షేత్రం

శిరిడీ సాయి క్షేత్రం
మానవత్వం ... సమానత్వం ... తన తత్త్వమని చాటిచెప్పిన అవతారపురుషుడు శ్రీ శిరిడీ సాయినాథుడు. ఆయన అనుసరించిన మార్గం ... ఆచరించిన సూత్రం ఆదర్శప్రాయమై నిలిచింది. సాయిని ఆశ్రయించి నిరాశతో వెనుదిరుగినవారు లేరు. ప్రత్యక్షంగా ... పరోక్షంగా ఆయన సహాయసహకారాలను పొందిన వారు ఎందరో వున్నారు.

ఇక తనని నమ్మిన భక్తుల ఆవేదన తీర్చడంలోను ... ఆపదలను అడ్డుకోవడంలోను సాయి ఏ మాత్రం ఆలస్యం చేయడు. ఈ కారణంగానే ఈ రోజున ప్రతి ఊళ్లోనూ రామాలయంతో పాటు సాయి మందిరం వెలుస్తూ వస్తోంది. అలా రూపుదిద్దుకుని సాయి ఆత్మీయతకు ఆలవాలమై అలరారుతోంది 'నెమ్లి' లోని సాయి మందిరం. ఈ క్షేత్రం నిజామాబాద్ జిల్లాలో దర్శనమిస్తోంది.

సాయికి పచ్చదనమన్నా ... పూలతోటలన్నా ఎంతో ఇష్టం. అందువల్లనే ఇక్కడి మందిరం ప్రశాంతమైన వాతావరణంలో ... పచ్చదనం నడుమ కొలువుదీరి కనిపిస్తుంది. సుందరమైన మందిరంలో ... విశాలమైన మంటపంలో సాయి కొలువై ఉంటాడు. భక్తుల భజనలు ... హారతులు ఆలకిస్తున్నట్టుగా ఆయన మూర్తి కనిపిస్తుంది. మందిరానికి ఒకవైపున వినాయకుడు ... మరొకవైపున దత్తాత్రేయుడు కొలువుదీరి కనిపిస్తారు.

శిరిడీలో మాదిరిగానే ఇక్కడ అభిషేకాలు ... అలంకరణలు ... హారతులు ... పల్లకీ సేవ ... పవళింపు సేవ ఘనంగా జరుగుతుంటాయి. సాయినాథుడికి అభిషేకం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కూడా కల్పించడం ఇక్కడ విశేషం. ప్రతి గురువారం రోజున ... పర్వదినాల సమయంలోను సాయిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి సాయినాథుడిని సేవించిన వారికి ఆయన ఏ లోటూ రానివ్వడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles