అభయాంజనేయ క్షేత్రం

అభయాంజనేయ క్షేత్రం
శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరాముడిపట్ల అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను ఆంజనేయస్వామి ప్రదర్శించాడు. శ్రీరాముడి ఆదేశాలను పాటిస్తూ సీతమ్మవారి జాడ తెలుసుకోవడంలో కీలకమైన పాత్రను పోషించాడు. సీతారాముల ఆనందమే తన ఆనందంగా గడిపి వారి ఆదరాభిమానాలను పొందిన ఆంజనేయుడు, భక్తాగ్రేసరుడిగా ప్రసిద్ధిచెందాడు.

ఈ నేపథ్యంలో భక్తాంజనేయ స్వామిగా ఆయన వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువుదీరిన మరో విశిష్టమైన క్షేత్రం మనకి తూర్పు గోదావరి జిల్లా 'రాజోలు' లో కనిపిస్తుంది. త్రేతాయుగం నుంచి స్వామి పూజలు అందుకుంటున్నట్టు స్థల పురాణం చెబుతోంది. వశిష్ఠ మహర్షి ఇక్కడి స్థల పవిత్రతను గ్రహించి 'సోమయాగం' నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో యాగరక్షణ కోసం ఆయన ఆంజనేయస్వామివారి ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆనాటి నుంచి స్వామివారిని ఎందరో మహర్షులు ... రాజులు ... భక్తులు దర్శించి తరించారు.

గర్భాలయంలో స్వామి మూలమూర్తి చిన్నదే అయినా, తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. శ్రీరాముడిపట్ల గుండెల నిండుగా భక్తిని నింపుకున్నట్టుగా నమస్కార ముద్రతో కొలువై ఉంటాడు. ఇక్కడి స్వామి అందరి ఆవేదనలను ఆలకిస్తాడనీ, సత్వరమే వారికి ఉపశమనాన్ని కలిగిస్తాడని చెబుతుంటారు. గ్రహ దోషాలతో బాధపడేవారికి ... అనారోగ్య సమస్యలతో సతమతమైపోయేవారికి స్వామివారి ఆశీస్సులు ఔషధంలా పనిచేస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

సాధారణ రోజుల్లో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ఇక 'హనుమజ్జయంతి' ... 'శ్రీరామనవమి' ఉత్సవాలని ఇక్కడ నయనానందకరంగా నిర్వహిస్తుంటారు. ఇదే ప్రాంగణంలో కొలువుదీరిన కోదండ రాముడు ... వినాయకుడు భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు.

More Bhakti Articles