కటాహతీర్థ మహిమ

కటాహతీర్థ మహిమ
తిరుమలలోని 'కటాహ తీర్థం' మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ తీర్థం సేవించినంతనే పంచమహా పాతకాలు పారిపోతాయని మహర్షులు సైతం చెప్పారు. ఈ తీర్థం ఇంతటి మహిమను కలిగి ఉండటానికి కారణం, ఇది శ్రీవారి పాదాల నుంచి వచ్చే అభిషేక తీర్థం కావడమే. ఈ తీర్థం అన్నమాచార్య భాండారానికి ఎదురుగా ఏర్పాటు చేయబడిన తొట్టిలోకి వస్తుంది. అందువలన దీనిని 'తొట్టి తీర్థం' అని కూడా పిలుస్తుంటారు.

ఇది విమాన ప్రదక్షిణ మార్గంలో కనిపిస్తుంది. ఈ తీర్థ సేవనం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని తెలియజేసే కథ ఒకటి మనకి పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో 'వేదపురం' అనే గ్రామం వుండేది. ఆ గ్రామంలో పరమ నిష్టా గరిష్టుడైన పద్మనాభుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడైన కేశవుడు వ్యసనపరుడై అనేక పాపాలను చేస్తుండేవాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వారి మాటలను వినిపించుకునే వాడు కాదు.

చివరికి ఒకసారి వ్యసనాలకు అవసరమైన ధనం కోసం ఓ బ్రాహ్మణుడి ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఆ ప్రయత్నంలో అతన్ని హత్య చేశాడు. బ్రహ్మ హత్యా పాతకం వికృతమైన రూపాన్ని ధరించి కేశవుడి వెంటపడటంతో, తనని రక్షించమంటూ అతను తండ్రి పాదాలను ఆశ్రయించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి, బ్రహ్మ హత్యాపాతకం నుంచి బయటపడాలంటే తిరుమల క్షేత్రంలోని 'కటాహతీర్థం' సేవించడం మినహా మరో మార్గం లేదని చెప్పాడు. ఈ తీర్థాన్ని సేవించడం వలన సర్వ పాపాలు ... సమస్త రోగాలు మటుమాయమై పోతాయని అన్నాడు.

దాంతో కేశవుడు తిరుమల చేరుకొని పుష్కరిణిలో స్నానమాచరించి ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్నాడు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకుని, కటాహతీర్థం సేవించి బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడ్డాడు. అందువలన తిరుమల వెళ్లిన భక్తులు కటాహ తీర్థం స్వీకరించడం మరిచిపోకూడదు.

More Bhakti Articles