శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరించింది. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత వుంది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెనుగొండ'లో విలసిల్లుతోంది.

ఇది వాసవీమాత క్షేత్రంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అంతకు పూర్వం నుంచే ఇక్కడ 'నగరేశ్వరుడు' పేరుతో శివయ్య పూజలందుకుంటున్నాడు. ఈ స్వామి ఇక్కడ వేల సంవత్సరాలు క్రితమే ఆవిర్భవించాడనడానికి ఆధారాలు వున్నాయి. ఎందరో రాజ వంశీకులు ఈ స్వామి అనుగ్రహంతో విజయాలు సాధించారు. మరెందరో మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారు. ఇక ఈ స్వామికి ఎదురుగా 'రెండు నందులు' కొలువుదీరి వుండటం విశేషంగా చెప్పుకుంటారు.

కాలక్రమంలో ఆలయాన్ని పునఃనిర్మిస్తూ మహిషాసుర మర్ధిని అమ్మవారినీ ... వాసవీ కన్యకా పరమేశ్వరిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక అమ్మవారి ఆవిర్భవానికి సంబంధించిన విషయంలోకి వెళితే, 'పెనుగొండ' ప్రజల కోసం అమ్మవారు తన భక్తులైన దంపతులకు జన్మించింది. యుక్తవయసులోకి అడుగుపెట్టిన వాసవిని, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తోన్న రాజు వివాహం విషయంలో ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె మానవ రూపాన్ని చాలించి శక్తి స్వరూపిణిగా అవతరించింది. అప్పటి నుంచి భక్తులు ఆమెను అనేక విధాలుగా ఆరాధిస్తూ వస్తున్నారు.

లక్ష్మీ జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

More Bhakti Articles