స్త్రీలు - పారాయణం

స్త్రీలు - పారాయణం
భక్తి శ్రద్ధల విషయంలో పురుషులకన్నా స్త్రీలెప్పుడు ముందుగానే వుంటారు. ఎప్పుడూ ఏవో వ్రతాలు ... నోములు ... పారాయణాలు చేస్తుంటారు. తమ సంతానం ... సౌభాగ్యం క్షేమంగా వుండటం కోసం పూజలు ... ఉపవాసాలు చేస్తుంటారు. భక్తి మార్గం స్త్రీలకు స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. దాంతో వీరంతా బృందంగా ఏర్పడి, భజనలు ... పారాయణాలు చేస్తుంటారు.

ఇలాంటి సమయంలో ఒకరి నుంచి ఒకరికి చేరే కొన్ని విషయాలు వారి మనసులో బలంగా నాటుకుంటూ వుంటాయి. స్త్రీలు 'సుందరకాండ' పారాయణం చేయకూడదనే విషయం కూడా అలా ఏ ప్రాంతంలోనో పుట్టి ప్రచారమైనదే. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ... ఆయన స్త్రీలకు దూరంగా ఉంటాడు కాబట్టి ... నియమనిష్టల్లో తేడా వస్తే ఆగ్రహిస్తాడనే కారణాలను నమ్మిన వారు నిజంగానే సుందరకాండ పారాయణానికి దూరమవుతూ వస్తున్నారు. నిజానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే.

స్త్రీలు శుచిగా వున్నప్పుడు సుందరకాండ పారాయణం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. వాల్మీకి మహర్షి రచించిన 'శ్రీ మద్రామాయణం' రమణీయమైన దృశ్య కావ్యం. అలాంటి రామాయణానికే అందాన్ని తీసుకు వచ్చినది 'సుందరకాండ'. ఇది స్త్రీలు పారాయణం చేయకూడనిదైతే అసలు రామాయణ కావ్యానికి వాల్మీకి 'సీతా యా శ్చరితం మహత్' (గొప్పదైన సీత కథ) అనే పేరు పెట్టేవాడు కాదని పండిత ప్రముఖులు అంటున్నారు. కనుక ఈ విషయంలో స్త్రీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చింతగా 'సుందరకాండ' పారాయణం చేసుకోవచ్చు. ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.

More Bhakti Articles