చమురు షాక్‌ ప్రభావం స్వల్పమే.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ ధీమా

  • భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న ఐఎంఎఫ్‌
  • దేశీయ డిమాండ్‌ బలంగా ఉండడమే కారణమని విశ్లేషణ
  • దేశ ఆర్థిక సూచీలన్నీ నిలకడగా ఉన్నాయని వెల్లడి
  • 2026 వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించిన ఐఎంఎఫ్‌
  • 2027లో మళ్లీ పుంజుకుంటుందని వెల్లడి
పశ్చిమాసియా ఘర్షణల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. తాజా ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో 2026 సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.4 శాతానికి స్వల్పంగా తగ్గించినప్పటికీ, 2027లో వృద్ధి మరింత బలపడుతుందని వెల్లడించింది. దేశీయ డిమాండ్‌ బలంగా ఉండటం, ఇటీవలి ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయని ఐఎంఎఫ్‌ వివరించింది.

ఐఎంఎఫ్‌ రీసెర్చ్‌ విభాగం అధికారి డెనిజ్‌ ఇగాన్‌ మాట్లాడుతూ.. తాజా ఆర్థిక సూచీలు భారత ఆర్థిక వ్యవస్థలో నిలకడను చూపిస్తున్నాయని తెలిపారు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు, వాటి ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడటం వల్ల 2026 వృద్ధి అంచనాను స్వల్పంగా తగ్గించాల్సి వచ్చిందన్నారు. ఈ ఇంధన ఒత్తిడి 2027 నాటికి తగ్గుముఖం పట్టడంతో భారత వృద్ధి మళ్లీ 6.5 శాతం స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఐఎంఎఫ్‌ తాజా అంచనాలు విడుదల చేసింది. 2026లో ప్రపంచ వృద్ధి 3 శాతం, 2027లో 3.4 శాతంగా ఉంటుందని తెలిపింది. అయితే పశ్చిమాసియా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చితే చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిస్తున్నాయని కూడా ఐఎంఎఫ్‌ పేర్కొంది.

IMF
Indian economy
Oil prices
World Economic Outlook
India GDP growth
West Asia conflict

More Telugu News