అది ప్రభుత్వమా, గూండాల రాజ్యమా?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
- అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని ఖండించిన జగన్
- చంద్రబాబే ఈ దాడిని ఉసిగొల్పారని తీవ్ర ఆరోపణ
- ఈ దుష్ట సంప్రదాయానికి రెట్టింపు స్పందన ఉంటుందని హెచ్చరిక
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న తమ పార్టీ నేతలపై దాడి చేయించడం ద్వారా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హననం చేశారని జగన్ మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, రైతులపై సాగుతున్న దౌర్జన్యాలు బయటపడకుండా ఉండేందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
భూములు ఇవ్వని రైతులను భూసేకరణ నోటీసులతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడం వంటి దారుణాలకు ప్రభుత్వం ఒడిగడుతోందని జగన్ ఆరోపించారు. కొండవీటి వాగు నీటిని బలవంతంగా పొలాల్లోకి మళ్లించి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నేడు మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, భవిష్యత్తులో రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు," అని చంద్రబాబును హెచ్చరించారు. ఈ దాడులకు వైసీపీ తలవంచదని, అమరావతి రైతులు, బాధితులకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు.