అమరావతిపై వైసీపీ కక్షగట్టింది: మంత్రి నాదెండ్ల మనోహర్
- అమరావతిపై వైసీపీ కక్షగట్టిందన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- రైతులపైకి దండయాత్రలా వెళ్లి రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపణ
- ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ విధ్వంసం మొదలైందని వ్యాఖ్య
- అమరావతిలో పనులు వేగవంతం కావడంతో ఓర్వలేకపోతున్నారన్న నాదెండ్ల
- రాజధానిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతోనే మొదలైందని, ప్రజావేదిక కూల్చివేత నుంచి నేటి రాళ్ల దాడి వరకు వైసీపీ దుష్ట ఆలోచనలు బయటపడుతూనే ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో గతంలో రైతులను నట్టేట ముంచారని, ఇప్పుడు ప్రజలు తిరస్కరించినా "మావిగన్" వంటి విచిత్రమైన పేర్లతో హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మనోహర్ పేర్కొన్నారు. భవన నిర్మాణాలు, రహదారుల పనులు చురుగ్గా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక, రాజధానిలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ అనాలోచిత చర్యలను ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు.