ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపు
- ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
- ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఎయిర్పోర్టుకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు
- 24 గంటల పాటు బార్లు, వైన్ షాపుల నిర్వహణకు అవకాశం
- భారీ ఫీజులతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
- మూడేళ్ల తర్వాత ఈ విధానంపై సమీక్షించనున్న సర్కార్
ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, విమానాశ్రయాల్లోని బార్లు, వైన్ షాపులు 24 గంటలూ పనిచేసేందుకు అనుమతి కల్పించారు. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు, ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఖరారు చేసింది. ఎయిర్పోర్టులో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, వైన్ షాపు కోసం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
ఇక ఎక్సైజ్ సుంకం విషయానికొస్తే, విమానాశ్రయంలోని వైన్ షాపుకు ఏటా రూ.2 కోట్లుగా నిర్ణయించారు. బార్లకు ప్రయాణికుల రద్దీ ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రకాలుగా విభజించారు. ఏడాదికి 20 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు ఉన్న విమానాశ్రయాల్లోని బార్లకు రూ.25 లక్షలు, 20 లక్షల లోపు ప్రయాణికులు ఉన్నచోట రూ.15 లక్షలుగా ఎక్సైజ్ సుంకాన్ని నిర్ధారించారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానాన్ని మూడేళ్ల తర్వాత సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.