ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నారాయణ

Minister Narayana reviews arrangements for Nellore Rottela Panduga at Bara Shahid Dargah
  • నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద ప్రారంభమైన రొట్టెల పండుగ
  • స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి పట్టుకున్న నారాయణ
  • అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టెను పట్టుకున్నానన్న మంత్రి
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా మొదలైంది. మంత్రి నారాయణ ఈ రొట్టెల పండుగ ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, ఆపై పట్టుకున్నారు. ఆ తర్వాత దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ... “412 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దర్గాకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 2014కి ముందు సుమారు 4 లక్షల మంది మాత్రమే వచ్చేవారు, వసతులు సరిగా లేవు. ఇప్పుడు వసతి సౌకర్యాలు, అభివృద్ధి పనులు భారీగా చేపట్టాం” అని తెలిపారు.

గత ప్రభుత్వం దర్గా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి, నెల్లూరు బారాషహీద్ దర్గాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దేశ-విదేశాల నుంచి భక్తులు నమ్మకంతో వస్తున్నారన్నారు. చెరువు నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 6,315 మున్సిపల్ సిబ్బంది.. 1,870 పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

భద్రతకు గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని, బోట్ షికారు కోసం 8 రకాల బోట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టె పట్టుకున్నట్లు మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
Minister Narayana
Rottela Panduga
Bara Shahid Dargah
Nellore
Swarnala Cheruvu
Andhra Pradesh Tourism

More Telugu News