ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు అంకురార్పణ.. ఈసారి 69 అడుగుల రూపం!
- పంచముఖ సంకటహర గణపతిగా దర్శనమివ్వనున్న వినాయకుడు
- ఇరువైపులా సోమనాథ్, కాళికామాత రూపాలు
- పర్యావరణ హితంగా మట్టితో భారీ విగ్రహం నిర్మాణం
- నిర్మాణ పనుల్లో 100 మందికిపైగా కళాకారులు
ఈ సంవత్సరం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ స్వామివారు ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పూర్తి పర్యావరణహితంగా మట్టితో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దనున్నారు. ఐదు పడగల ఆదిశేషుని నీడలో, ఎనిమిది చేతులతో పద్మాసనంపై ఆసీనుడై ఉండేలా విగ్రహాన్ని రూపొందిస్తారు. స్వామివారి ఐదు ముఖాలు పంచభూతాలకు ప్రతీకగా నిలవనున్నాయి.
ఈసారి విగ్రహానికి ఇరువైపులా ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం నమూనా, ఎడమవైపు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాళికామాత రూపం కొలువుదీరనున్నాయి.
సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉండటంతో వచ్చే 82 రోజుల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ పనుల్లో పాల్గొంటారు. 1954లో అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి ప్రస్థానం ఈ స్థాయికి చేరడం విశేషమని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.