కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్
- డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపణ
- దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన
- రుణాలపై వడ్డీ రాయితీ హామీని విస్మరించడం వల్ల మహిళలకు రూ.6 వేల కోట్లు నష్టం
- వైసీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని వెల్లడి
- ప్రస్తుత పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని జగన్ విమర్శించారు. ఈ హామీని అమలు చేయకపోవడం వల్ల మహిళలు ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.6 వేల కోట్ల ప్రయోజనాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని, ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా అండగా నిలిచామని జగన్ గుర్తుచేశారు. పెంచిన రుణ పరిమితి సంగతి అటుంచి, ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికి కూడా మద్దతు ఇవ్వకుండా కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.