అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్
- అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా
- 'చో హ్యోన్' డిస్ట్రాయర్తో నౌకాదళాన్ని ఆధునికీకరిస్తున్న కిమ్
- ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన
- అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్ చర్య
- కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత
పశ్చిమ తీరంలోని నాంపో నౌకాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. "గత ఏడు దశాబ్దాలుగా నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు ఈ యుద్ధనౌకతో ముగింపు పలికాం" అని ఆయన వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. విమాన విధ్వంసక వ్యవస్థలు, యాంటీ-షిప్ క్షిపణులతో పాటు అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా 'చో హ్యోన్' ప్రయోగించగలదు. ఇది ప్రధానంగా దేశ పశ్చిమ తీరంలో గస్తీ నిర్వహించనుంది.
ఈ సందర్భంగా కిమ్ పలు కీలక ప్రకటనలు చేశారు. రాబోయే ఐదేళ్లలో ఏటా రెండు 'చో హ్యోన్' తరహా డిస్ట్రాయర్లను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. వీటితో పాటు 10,000 టన్నుల భారీ యుద్ధనౌకలను, కొన్ని అత్యంత శక్తిమంతమైన "రహస్య జలాంతర్గత ఆయుధాలను" కూడా అభివృద్ధి చేయాలని రక్షణ రంగాన్ని ఆదేశించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికే ఈ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ డిస్ట్రాయర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2025లో జలప్రవేశం చేసిన ఈ నౌకపై ఇప్పటికే పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు. తాజా పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో భద్రతా పరమైన ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఉత్తర కొరియా వేగంగా చేపడుతున్న సైనిక ఆధునికీకరణపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.