భారత్‌లో ధనికుల పిల్లలు చదివే టాప్‌ స్కూల్స్‌ ఇవే..!

Prestigious Indian schools preferred by politicians and Bollywood stars
  • ధనిక కుటుంబాల తొలి ఎంపికగా 7 పాఠశాలలు
  • డూన్‌ స్కూల్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపు
  • అంబానీ స్కూల్‌లో చదివిన స్టార్‌ కిడ్స్‌
  • వుడ్‌స్టాక్‌ ఆసియాలోనే పురాతన రెసిడెన్షియల్‌ స్కూల్‌
  • వెల్హామ్‌ బాలికల విద్యలో అగ్రస్థానం
  • మాయో కాలేజ్‌కు 150 ఏళ్లకు పైగా చరిత్ర
రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారల పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? అనే ప్రశ్న చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. దేశంలో వేలాది పాఠశాలలు ఉన్నప్పటికీ కొన్ని విద్యాసంస్థలు మాత్రం సంపన్న కుటుంబాలకు ఫస్ట్‌ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. భారీ ఫీజులు, కఠిన ప్రవేశ పరీక్షలు, గొప్ప వారసత్వం, అద్భుతమైన క్యాంపస్‌లు వీటి ప్రత్యేకత. భారత్‌లోని ధనిక, ప్రముఖ కుటుంబాలు ఎక్కువగా ఎంచుకునే ఏడు ప్రముఖ పాఠశాలలు ఇవి.

ది డూన్‌ స్కూల్‌
1935లో ప్రారంభమైన ఈ పాఠశాలను దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌గా భావిస్తారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ప్రవేశం పొందడం చాలా కష్టం. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ, రాహుల్‌ గాంధీ, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా వంటి ప్రముఖులు ఇక్కడ చదివారు.

ది సింధియా స్కూల్‌
1897లో స్థాపించిన ఈ పాఠశాల తొలుత రాజకుటుంబాల పిల్లల కోసం ప్రారంభించారు. గ్వాలియర్‌ కోటపై ఉండటం దీని ప్రత్యేకత. కోటలోనే చదువు, నివాసం ఉండే అరుదైన విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. నటుడు సల్మాన్‌ ఖాన్‌, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వంటి ప్రముఖులు ఇక్కడ విద్యనభ్యసించారు.

ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌
2003లో ముంబైలో ప్రారంభమైన ఈ పాఠశాలను రిలయన్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. నీతా అంబానీ దీనికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. బాలీవుడ్‌, వ్యాపార కుటుంబాల పిల్లలు ఎక్కువగా ఇక్కడే చదువుతుంటారు. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్‌, సుహానా ఖాన్‌ వంటి ప్రముఖుల పిల్లలు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు.

వుడ్‌స్టాక్‌ స్కూల్‌
1854లో స్థాపించబడిన ఈ పాఠశాల ఆసియాలోనే అత్యంత పురాతన రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఒకటి. ముస్సోరీలో అటవీ ప్రాంతం మధ్య 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించే ఈ పాఠశాలలో వార్షిక ఫీజులు లక్షల్లో ఉంటాయి. ప్రముఖ నటుడు టామ్ ఆల్టర్ ఇక్కడ చదివారు.

వెల్హామ్‌ గర్ల్స్‌ స్కూల్‌
భారత్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఇది ఒకటి. డెహ్రాడూన్‌లో 1957లో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రవేశం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. నటి కరీనా కపూర్‌ ఖాన్‌, రాజకీయ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడ విద్యనభ్యసించారు.

మయో కాలేజ్‌
అజ్మీర్‌లో 1875లో ప్రారంభమైన ఈ పాఠశాలను ‘ఈటన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని పిలుస్తారు. ఒకప్పుడు భారతీయ రాజకుమారుల కోసం ఏర్పాటైన ఈ విద్యాసంస్థ ఇప్పుడు దేశంలోని ప్రముఖ బోర్డింగ్‌ స్కూళ్లలో ఒకటిగా ఉంది. నటుడు బాబీ డియోల్‌ ఇక్కడ చదివారు.

ఈకొల్‌ మాండియేల్‌ వరల్డ్‌ స్కూల్‌
ముంబైలోని జుహూలో ఉన్న ఈ అంతర్జాతీయ పాఠశాల 2004లో ప్రారంభమైంది. ప్రీ-స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు విద్య అందిస్తుంది. బాలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్స్‌ తమ పిల్లలను ఇక్కడ చదివిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇక్కడ చదివిన వారిలో ఒకరు.
Prestigious Schools in India
Dhirubhai Ambani International School
The Doon School
Celebrity children schools
Top boarding schools India
Expensive schools in India

More Telugu News