రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్
- ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్
- కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం
- ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలను అందజేశారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన మున్సిపల్ లీడర్స్, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.