రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం ఉక్కుపాదం.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!

Indian Railways cracks down on begging and unauthorized vending with heavy fines and jail
  • జన్ విశ్వాస్ చట్టం-2026 కింద రైల్వే నిబంధనలు మరింత కఠినతరం
  • రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా
  • అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం
  • జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5,000 ఫైన్
  • నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దించివేసేలా అధికారులకు పవర్స్
రైలు ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. 'జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం-2026' కింద రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాలలో ధూమపానం, అనధికారికంగా వస్తువులు విక్రయించడం, భిక్షాటన చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ అప్పటికప్పుడు రూ.2,000 జరిమానా విధించనున్నారు. ఈ నెల 19న అధికారికంగా విడుదలైన ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఈ నూతన చట్టం ప్రకారం.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 167 కింద గతంలో ధూమపానానికి ఉన్న రూ.100 స్వల్ప జరిమానాను ఇప్పుడు ఏకంగా రూ.2,000కు పెంచారు. అంతేకాకుండా స్మోకింగ్ చేస్తూ దొరికితే వెంటనే సదరు ప్రయాణికుడి పాస్ లేదా టికెట్‌ను రద్దు చేసి, తదుపరి స్టేషన్‌లో రైలు నుంచి కిందకు దించేసే అధికారాన్ని రైల్వే సిబ్బందికి కల్పించారు. ఒకవేళ అక్కడికక్కడే జరిమానా చెల్లించకపోతే కోర్టు ముందు హాజరుపరుస్తారు, అక్కడ నేరం రుజువైతే గరిష్టంగా రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. రైళ్లలో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

మరోవైపు సెక్షన్ 144 కింద రైల్వే లైసెన్స్ లేకుండా రైళ్లలో తిరుగుతూ వ్యాపారం చేసే హ్యాకర్లు, భిక్షాటన చేసే వారిపై పూర్తి నిషేధం విధించారు. వీరికి కూడా రూ.2,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ వీరు జరిమానా కట్టని పక్షంలో కోర్టు ద్వారా 3 నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 ఫైన్ లేదా ఈ రెండూ విధించేలా చట్టాన్ని సవరించారు. ఇక పదే పదే (నాలుగోసారి లేదా అంతకంటే ఎక్కువ) ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ దొరికిపోతే కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గతంలో లాగా కేవలం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం వేచి చూడకుండా, సివిల్, అడ్మినిస్ట్రేటివ్ చర్యల ద్వారా వేగంగా జరిమానాలు వసూలు చేసేలా రైల్వే అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి.
Go Back to Shorts
Indian Railways
Jan Vishwas Act
Railway Smoking Fine
Railway Begging Penalty
Unauthorized Train Vending
Railway Safety Rules

More Telugu News