స్కూల్లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్పై సస్పెన్షన్ వేటు!
- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి హైస్కూల్లో పనిచేస్తున్న ఎల్లయ్య
- చిట్టీలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేసిన వైనం
- ఎల్లయ్యను సస్పెండ్ చేసిన డీఈఓ
బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. బయల పెద్ద ఎత్తున చిట్టీల వ్యాపారం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ దందా నడిపిస్తున్న మ్యాథ్స్ టీచర్ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి జెడ్పీ హైస్కూల్లో కలువల ఎల్లయ్య అనే వ్యక్తి మ్యాథ్స్ టీచర్గా పని చేస్తున్నాడు. అయితే ఈయనగారు స్కూల్ టైమింగ్స్ దాటిన తర్వాత ప్రభుత్వ రూల్స్ కి పూర్తిగా విరుద్ధంగా ప్రైవేటుగా చిట్టీల వ్యాపారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిట్టీల డబ్బుల విషయంలో పలువురిని మోసం చేశాడంటూ ఇటీవల ఎల్లయ్యపై బాధితులు ఫిర్యాదులు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి ప్రైవేట్ దందాలు చేయడంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ జరిపిన ప్రాథమిక విచారణలో ఎల్లయ్య రూల్స్ బ్రేక్ చేసి చిట్టీల దందా నడిపినట్లు, మోసాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిజమని తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) గిరిరాజ్ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.