శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
- శివసేన (యూబీటీ)లో మరోసారి పెద్ద తిరుగుబాటు
- తొమ్మిది మందిలో ఆరుగురు లోక్సభ ఎంపీలు రెబల్గా మారడంతో సంక్షోభం
- పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన
ముంబైలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉద్ధవ్ మాట్లాడుతూ, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నేను పదవిని అంటిపెట్టుకుని ఉండాలని అనుకోవడం లేదు. ఒకవేళ నేను ఈ పదవికి అర్హుడిని కాదని మీరు భావిస్తే, తక్షణమే వైదొలుగుతాను. పార్టీ బాధ్యతలను ఎవరైనా చేపట్టవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఎంపీలు తిరుగుబాటుపై ఓటర్లకు క్షమాపణలు చెబుతూనే, బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు.
పార్టీకి ఉన్న తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు - సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నాయక్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, భావ్సాహెబ్ - పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరంతా ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే మాత్రమే ఉద్ధవ్ వెంట నడుస్తున్నారు.